● కనులపండువగా ఇమామే హుస్సేన్ సవారీ
● వేలాదిగా తరలివచ్చిన జనం
అమరచింత: మొహర్రం సందర్భంగా 10 రోజుల పాటు పీర్ల చావిడీల్లో కొలువుదీరిన ఆలంలను శనివారం నిమజ్జనానికి తరలించారు. అమరచింతలో ఇమామే హుస్సేన్ ఆలం సవారీ శుక్ర, శనివారం కొనసాగాయి. శుక్రవారం రాత్రి ఇమామే హుస్సేన్ సవారీకి వేలాదిమంది దివిటీలను చేతబట్టి ఆలంకు వెలుతురునిస్తూ తమ మొక్కులు తీర్చుకోగా.. శుక్రవారం చివరిరోజు ఇమామే హుస్సేన్ ఆలం నిమజ్జనోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. దీంతో పట్టణ ప్రధాన రహదారులన్ని జనంతో కిక్కిరిసిపోగా ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఎస్ఐలు స్వాతి, జయన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే..
పట్టణంలోని పెద్దపీర్ల మసీదులో కొలువుదీరిన ఇమామే హుస్సేన్ ఆలంను శుక్రవారం మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలంకు చాదర్, పూలమాల సమర్పించారు. నాయకులు ఎస్ఎ రాజు, నర్సింహులుగౌడ్, నాగభూషణంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
● ఇమామే ఉస్సేన్ ఆలంను శుక్రవారం కాంగ్రెస్పార్టీ నాయకులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జింక సువర్ణ రవి, వైస్ చైర్పర్సన్ రాధఅరుణ్ పూలమాలలు, చాదర్ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్ల నిమజ్జనోత్సవానికి కులమతాలకు అతీతంగా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ఆలంలను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా జరిగే ఇమామే హుస్సేన్ ఆలం సవారీకి ఉమ్మడి జిల్లావాసులే కాకుండా కర్ణాటకలోని రాయచూర్ నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.


