కొత్తకోట రూరల్: ఉద్యాన కళాశాల విద్యార్థులు ఉసిరి, చింత, నేరేడు వంటి దీర్ఘకాలిక ఉద్యాన పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి కోరారు. జిల్లాలోని మోజర్లలో ఉన్న ఉద్యాన కళాశాల 19వ వార్షికోత్సవ వేడుకలను గురువారం రాత్రి నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల మార్పిడీ విధానాన్ని అనుసరిస్తూ ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి సత్కరించారు. అంతకుముందు ఉద్యాన విభాగం డీన్ డా. జె.చీనానాయక్ మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధించి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంఎస్సీ చదివే లక్ష్యంతో విశ్వవిద్యాలయ పరిధిలో జేఆర్ఎఫ్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ వీణాజ్యోషి గత విద్యా సంవత్సరానికి సంబంధించిన కళాశాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సర్పంచ్ చంద్రశేఖర్, మార్కెట్యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్ పాల్గొన్నారు.


