వనపర్తిటౌన్: రైతులు రసాయన ఆధారిత వ్యవసాయం కాకుండా ప్రకృతి సాగుకు మొగ్గు చూపాలని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పాపయ్యగౌడ్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ప్రకృతి వ్యవసాయంపై రైతులతో కార్యశాల నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూజుల అనుజ్ఞారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. రసాయన వ్యవసాయంతో భూసారం క్షీణిస్తోందని, రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించడం ద్వారా భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, జీవామృతం, ఘన జీవామృతం తయారీ, సేంద్రియ ఎరువుల వినియోగం, నేల సారం పెంపు, పంటల దిగుబడి తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాకాసి అరవింద్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు దాబా శ్రీనివాస్రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, రాష్ట్ర నాయకుడు వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్నగారి వెంకటేశ్వర రెడ్డి, కేతూరి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్ గౌడ్, వారణాసి కల్పన, నాయకులు బండారు కుమారస్వామి, సుమిత్రమ్మ, తిరుమలేష్, మహేష్ ,26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ విజయ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.
శ్యామ్ప్రసాద్ వర్ధంతి ..
మాతృక భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జి బలిదాన్ దివస్ వర్ధంతి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు అధ్యక్షతన మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్రెడ్డి, రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్.వెంకటేశ్వర్ రెడ్డి, కేతురి బుడ్డన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు గోర్ల బాబురావు పాల్గొన్నారు.


