వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు సోమవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 5 పరీక్ష కేంద్రాల్లో 844 మంది విద్యార్థులకు గాను 790 మంది పరీక్షలకు హాజరు కాగా.. 54 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీవీ రామన్, రావూస్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని తెలిపారు.
ప్రతి ఒక్కరికీ
సేవాగుణం ఉండాలి
మక్తల్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సేవాగుణం ఉండాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణానికి చెందిన బురాన్ సమకూర్చిన దుస్తులను మంత్రి చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో సేవా కార్యక్రమాలతోనే గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాదృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు కొత్త దుస్తులు అందించిన బురాన్ను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, వాకిటి హన్మంతు, సరిత, రహీం పటేల్, శ్రీవిద్య, చెన్నమ్మ, జుట్ల అనిత, మహేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
ఆశావర్కర్లకు రూ.18వేల వేతనం ఇవ్వాలి
వనపర్తి రూరల్: ఆశావర్కర్లకు రూ. 18వేల పిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో 48 గంటల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, కార్యదర్శి మండ్ల రాజు, ఆశావర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సునీత, కార్యదర్శి బుచ్చమ్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయినా నేటికీ ఆశావర్కర్లకు పిక్స్డ్ వేతనం నిర్ణయించకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 1,500లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పారితోషికంతో కలిపి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశావర్కర్లకు ఫిక్స్డ్ వేతనం చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అదే విధంగా 6 నెలల పీఆర్సీ ఏరియల్స్ చెల్లించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆశావర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బిలి నిక్సన్, రాములు, గిరిజమ్మ, దేవమ్మ, చెన్నమ్మ, అనిత, ఇందిరా, తార, గోవిందమ్మ, లత, శాంతమ్మ, బాలకృష్ణమ్మ పాల్గొన్నారు.
పంట మార్పిడితో అధిక దిగుబడులు
గోపాల్పేట: పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియోగం, పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రాజేందర్రెడ్డి రైతులకు సూచించారు. సోమవారం గోపాల్పేట రైతువేదికలో డీఏఓ ఆంజనేయులుగౌడ్తో కలిసి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే మక్కిన పశువుల ఎరువులు, జీవామృతం, నీమాస్త్రం, దశపత్రి తదితర కషాయాలతో పంటల్లో చీడపీడలను నివారించవచ్చన్నారు. ఏటా ఒకే రకం పంటను వానాకాలం, యాసంగి సీజన్లో పండించకూడదని.. భూసార పరీక్షలకు అనుగుణంగా పంటమార్పిడి విధానం పాటించాలని సూచించారు.


