వనపర్తి టౌన్: బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు కృషి ఫలితంగానే జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరైందని.. ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్ని తానే చేశానని ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేయడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు డి.నారాయణ ఆరోపించారు. గురువారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2025, అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని.. అందులో భాగంగానే జిల్లాకేంద్రం సమీపంలోని నాగవరం శివారులో ఏర్పాటు జరగనుందని వివరించారు. నూతన భవన నిర్మాణం జరిగే వరకు రాజపేట శివారులోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ధైర్యం ఉంటే కేంద్రీయ విద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, భవిష్యత్లో భవన నిర్మాణం, ఇతర అవసరాలకు ఎన్ని కేటాయిస్తుందో పూర్తి వివరాలతో బహిరంగ చర్చకు సిద్ధంగా కావాలని సవాల్ విసిరారు. రెండేళ్లయిన సొంత మండలానికి బీటీ రోడ్డు వేసుకోలేని ఎమ్మెల్యే నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెచ్చారంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బాశెట్టి శ్రీనివాసులు ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.


