వనపర్తిటౌన్: మాదకద్రవ్యాల వ్యసనంతో జీవితాలే కాకుండా కుటుంబాలు నాశనమై రోడ్డున పడతాయని.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఈఓ అబ్దుల్ ఘని సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ఏర్పాటుచేసిన ప్రహరీ క్లబ్ శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల ద్వారా వచ్చే మత్తు కంటే, జీవితంలో సక్సెస్తో వచ్చే మత్తు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకుసాగాలని సూచించారు. ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్న వారితో సహవాసం మంచిది కాదన్నారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే, జీవితం అంతా బాగుంటుందని చెప్పారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట, బడిలో ఉపాధ్యాయుల మాట వింటూ జీవితాన్ని అందంగా మలుచుకోవాలని అన్నారు. సైకియాట్రిస్ట్ డా.పుష్పలత మాట్లాడుతూ.. విద్యార్థులు జీవితంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విద్యార్థి తీసుకునే నిర్ణయంతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందన్నారు. పరీక్షలపై భయాన్ని వీడి.. పట్టుదలతో చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ టీం ఇన్చార్జి అంజద్, షీ టీం అధికారి భవిత, మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి, ప్లానింగ్ అధికారి శేఖర్, జీసీడీఓ శుభలక్ష్మి, డీఎస్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


