వనపర్తి: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో సమస్యల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయా శాఖల అఽధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వ్యాధుల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి.. విద్యార్థులతో సమస్యలను తెలుసుకోవడంతో పాటు వారితో కలిసి భోజనం చేయాలని సూచించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతగా ఉందో లేదో తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులకు వడ్డించే వంటలను సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి నిర్ధారించాలనే నిబంధన కచ్చితంగా అమలు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం ఉన్నారు.
అర్జీలు సత్వరం పరిష్కరించాలి..
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దాఖలుచేసే అర్జీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్యలతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారం నిమిత్తం సంబంధిత అఽధికారులకు సిఫారస్ చేశారు. మొత్తం 40 అర్జీలు దాఖలు కాగా.. ఎక్కువగా భూ సమస్యలపై అర్జీలు అందినట్లు గ్రీవెన్స్ సెల్ అధికారులు వెల్లడించారు.


