గ్రామాల్లోని వన నర్సరీల్లో కానరాని గ్రీన్నెట్లు
అధికారుల నిర్లక్ష్యం..
నర్సరీల నిర్వహణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మొక్కల సంరక్షణను అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నాటిక మొక్కలకు సకాలంలో నీటిని సైతం అందించకపోవడంతో వాడుముఖం పడుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉన్న మొక్కలు ఎండిపోకుండా నీటిని అందిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలి.
– బాలకృష్ణ, అమరచింత
గ్రీన్నెట్లు ఏర్పాటుచేయాలి..
వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా గ్రీన్నెట్లను ఏర్పాటు చేయాలి. మొక్కలకు నీడ ను అందించడంతో వాడుముఖం పట్టకుండా ఉంటాయి. ఇందుకుగాను గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
– వెంకటేష్, నందిమళ్ల
నిర్వహణ బాధ్యతగ్రామపంచాయతీలదే..
గ్రామస్థాయిలోని నర్సరీల నిర్వహణ బా ధ్యత ఆ గ్రామపంచాయతీ పాలకవర్గాలదే. మొక్కల సంరక్షణ కోసం గ్రీన్నెట్ ఏర్పాటుకు పంచాయతీ నిధులు వినియోగించాల్సి ఉంది. త్వరలోనే అన్ని నర్సరీల్లో గ్రీన్నెట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం.
– ఉమాదేవి, డీఆర్డీఓ
అమరచింత: గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంపొందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలోనే నర్సరీ ఏర్పాటు చేసి 10 వేల మొక్కలు పెంచి ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో నాటి సంరక్షిస్తోంది. ఒక్కో మొక్కకు సుమారు రూ.16 వరకు వెచ్చిస్తూ నీటిని సైతం అందించే కార్యక్రమాలు చేపడుతోంది. నర్సరీల్లోని మొక్కలు వానాకాలం, చలికాలంలో రక్షణ లేకున్నా ఏపుగా పెరిగే అవకాశం ఉంది. కాని వేసవిలో ఎండ తీవ్రతకు వాడుముఖం పడుతూ ఎండిపోతుంటాయి. మొక్కల సంరక్షణకుగాను ముందస్తుగా నర్సరీల్లో గ్రామపంచాయతీ నిధులు ఖర్చుచేసి గ్రీన్ నెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఎండలు తీవ్రరూపం దాల్చినా జిల్లాలోని నర్సరీల్లో గ్రీన్నెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మొక్కలు వాడుముఖం పడుతున్నాయి. మరికొన్ని నర్సరీల్లో మొక్కల పెంపకానికి ప్లాస్టిక్ సంచుల్లో విత్తిన విత్తనాలు సైతం మొలకెత్తని పరిస్థితులు నెలకొన్నాయి.
కనిపించని జోష్..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘హరితహారం’ పేరుతో ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఊరూరా వేడుకగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం వన మహోత్సవంగా పేరు మార్చడం తప్ప గ్రామస్థాయిలో ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పాటు నర్సరీల నిర్వహణపై దృష్టి మందగించిందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గతంలో నాటిన మొక్కలు వాడిపోయి ఉంటే వాటిని గుర్తించి తొలగించడంతో పాటు వాటి స్థానంలో కొత్త మొక్క నాటి సంరక్షించే కార్యక్రమం చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
10 వేల మొక్కల పెంపకమే లక్ష్యం
ఒక్కో మొక్కకు రూ.16 వెచ్చింపు
అధికారు పర్యవేక్షణ కరువు
వాడుముఖం పడుతున్న వైనం
జిల్లాలో 255 గ్రామపంచాయతీలు


