ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న అధికారులు..
● వార్షిక పరీక్షలకు మిగిలింది
6 రోజులే..
● విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించిన ఉపాధ్యాయులు
● పక్కాగా ప్రాక్టీస్ పరీక్షల నిర్వహణ
● సబ్జెక్టుల వారీగా రివిజన్లు
●
పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశాం. వెనుకబడిన విద్యార్థుల కోసం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మూడు నెలలుగా అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. ఈసారి అనుకున్న లక్ష్యం మేర ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.
– అబ్దుల్ ఘని, జిల్లా విద్యాధికారి
అమరచింత కేజీబీవీలో ప్రత్యేక తరగతుల్లో
పదోతరగతి
విద్యార్థినులు (ఫైల్)
అమరచింత: విద్యార్థుల జీవితంలో పదోతరగతి తొలిమెట్టు. అంత వరకు సాధారణంగా చదివిన పాఠశాల పరిధిలోనే పరీక్షలు రాసే విద్యార్థులు మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాసేది పదోతరగతిలోనే. ఉపాధ్యాయుల పనితీరుకు సైతం ఇది పరీక్షా కాలమని చెప్పవచ్చు. వార్షిక పరీక్షలకు ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ప్రతిరోజు సబ్జెక్టుల వారీగా రివిజన్ చేస్తున్నారు. ఏఏఈఈఆర్టీ రూపొందించిన కరదీపికలతో పాటు ప్రత్యేక ప్రశ్నాపత్రాలు తయారు చేసి ఇది వరకే పరీక్షలు నిర్వహించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించే దిశగా జిల్లా విద్యాశాఖ అడుగులు వేస్తోంది.
జిల్లాలోని 15 మండలాల్లో 221 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో బాలికలు 3,635 మంది, బాలురు 3,577 మంది మొత్తం 7,212 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. గతేడాది వార్షిక పరీక్షలకు వంద రోజుల ముందుగా.. ఈ ఏడాది దసరా సెలవుల తర్వాత ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. కొన్నిచోట్ల దాతల సహకారంతో, మరికొన్ని చోట్ల కలెక్టర్ ప్రత్యేక నిధులతో అల్పాహారం అందించారు. కాగా ఈసారి గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు రావడంతో విద్యార్థులకు బోధనతో పాటు తరగతుల నిర్వహణ సైతం అంతంత మాత్రంగానే కొనసాగినట్లు తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. కేవలం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే ప్రత్యేక తరగతులు నిర్వహించారు.
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకుగాను విద్యాధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఎగ్జామినేషన్ జోన్లు 14, పరీక్ష కేంద్రాలు 37 గుర్తించారు. వీటిలో ఏ–కేటగిరిలో 12, బి–కేటగిరిలో 25 ఉన్నాయి. ప్రశ్నపత్రాల భద్రతకు 10 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.


