పురపాలికలో కీలక అధికారులు ఇతర ప్రాంతాలకు..
● అవగాహన లేని వారికి అదనపు బాధ్యతలు
● నెట్టుకు రాలేక ఇబ్బందులు పడుతున్న వైనం
● ముగ్గురు కీలక నేతలున్నా.. తప్పని కష్టాలు
33 వార్డులు..
22 మంది అధికారులు..
పురపాలికలో 33 వార్డులుండగా.. 23 మంది వార్డు అధికారులను నియమించారు. కాగా ఒక వార్డు అధికారి భానుప్రసాద్ డిప్యుటేషన్పై హైదరాబాద్కు వెళ్లడంతో ప్రస్తుతం 22 మంది ఉన్నారు. వీరిలో కొందరికి అదనపు వార్డులు కేటాయించారు. వీరికి పని భారం అధికం కావడంతో పాలనాపరమైన అంశాలపై పుర అధికారులతో తరచూ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వనపర్తిటౌన్: స్థానిక పురపాలికలో కీలక విభాగాల్లో పనిచేసే అధికారులు ఏళ్ల తరబడి డిప్యుటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో పాలన, పన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆస్తిపన్ను వసూళ్లకు ఇంకా 23 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఏ మేరకు లక్ష్యం చేరుకుంటారా అనే సందేహం వ్యక్తమవుతోంది. మున్సిపాలిటీకి ఆదాయం సమకూరడంలో సింహభాగం ఆస్తి పన్నుదే. ఆ విభాగానికే పూర్తిస్థాయి అధికారి లేకపోవడంతో రూ.కోట్లలో వసూలు కావాల్సి ఉండగా.. అరకొరగానే అవుతుండటంతో లక్ష్యంగా నెరవేరడం లేదు. ఆర్వో అనిల్కుమార్ రెండేళ్ల కిందట డిప్యుటేషన్పై కోస్గికి వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సాయిరాంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఆరోగ్యం సహకరించట్లేదని, బాధ్యతల నుంచి తప్పించాలని 6 నెలల కిందటే విన్నవించినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక నెట్టుకొచ్చారు. స్థానికుడు కావడంతో పన్ను వసూళ్లలో కొంత పురోగతి కనిపించినా.. ఆశించిన స్థాయిలో లక్ష్యం చేరలేదు. ఆయన గురువారం హఠాన్మరణం చెందడంతో ఎవరికి బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ ఊపందుకుంది. మేనేజర్ శంకర్, ఆర్ఐ రాజ్కుమార్, డీఈ యూనుస్ తప్పితే ఆ స్థాయిలో మరే అధికారి కనిపించడం లేదు.


