హిందూ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శం
ఖిల్లాఘనపురం: హిందూ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శమని పాలమూర్ విభాగ్ సహ కార్యవాహ సూర్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఖండ కార్యవాహ భాస్కర్ ఆధ్వర్యంలో శాఖల సంఘీక్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎదగాలని, అందుకు రోజు శాఖ చేయాలని సూచించారు. నేడు ప్రపంచ దేశాలు భారత్ వైపునకు చూస్తున్నాయని.. మనం నమ్మే హిందూ ధర్మాన్ని వారు ఎంతో గౌరవిస్తున్నారని చెప్పారు. సర్వేజనా సుఖినోభవంతు అంటూ ప్రపంచ శాంతిని కోరుకుంటున్నది భారత్, ఇక్కడి ధర్మం అన్నారు. కార్యక్రమంలో జిల్లా సామాజిక సామరస్యత ప్రముఖులు అశ్విని భగవంత్, జ్ఞానేశ్వర్, ఆంజనేయులు, విక్రం, వేణుగోపాల్, ఈశ్వర్, వివిధ గ్రామాల స్వయం సేవకులు పాల్గొన్నారు.


