అదుపు తప్పుతున్న చెరుకు ట్రాక్టర్లు
అమరచింత: కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలిస్తున్న ట్రాక్టర్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. అధికలోడ్తో అదుపు తప్పుతున్నా.. సంబంధిత రవాణాశాఖ అధికారులు నివారించడం లేదన్న విమర్శలు అధికమవుతున్నాయి. రైతులు తాము పండించిన పంటను ఫ్యాక్టరీకి తరలించే క్రమంలో ట్రాక్టర్లు డివైడర్లను ఢీకొట్టడం, రహదారి మలుపు వద్ద అదుపుతప్పి కిందపడటం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ట్రాక్టర్లో 14 టన్నుల చెరుకు మాత్రమే తరలించాల్సి ఉండగా.. 18 టన్నుల వరకు నింపడంతో లాగలేక ట్రాలీ పైకిలేచి చెరుకు గడలు కిందకు పడిపోతున్న సందర్భాలున్నాయి. అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అధికంగా చెరుకు సాగవుతుండటం.. డ్రైవింగ్ అనుభవం, లైసెన్స్ లేని వారు సైతం ట్రాక్టర్లను నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చెరుకు ట్రాక్టర్ బీభత్సం..
ఆత్మకూర్: పట్టణంలో శనివారం అర్ధరాత్రి చెరుకు ట్రాక్టర్ డివైడర్పైకి దూసుకెళ్లడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయాయి. అమరచింత వైపు నుంచి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో డివైడర్ను ఢీకొందని.. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పట్టణవాసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పుర సిబ్బంది ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.


