అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
అమరచింత: ఇందిరమ్మ ఇంటి పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని నాగల్కడ్మూర్లో శ్రీనివాస్రెడ్డి, సంధ్య దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి మంత్రి తన సతీమణి వాకిటి లలితతో కలిసి హాజరై శ్రీనివాస్రెడ్డి దంపతులకు కానుక అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని పేదలు ఇల్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మొదటి విడతలో అర్హులై ఇంటి స్థలం కలిగిన వారికి మంజూరు చేశామని చెప్పారు. మొదటి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గత పాలకులు అభివృద్ధిని విస్మరించారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.వందల కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, సర్పంచ్ శివకుమార్, అరుణ్కుమార్, జగన్రెడ్డి, ఆశిరెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం..
ఆత్మకూర్: పురపాలికను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని.. ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులకు రూ.400 కోట్లు తీసుకొచ్చామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం పట్టణంలోని వాసవీమాత ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, ఏపీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని, పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తోందని.. నియోజకవర్గంలోని వైశ్యులకు ఏ ఆపద వచ్చినా ముందుంటానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత మాట్లాడుతూ.. మార్చి 22న హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో వాసవీమాత పారాయణ కార్యక్రమాన్ని 40 వేల మందితో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏపీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించి మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చని.. ఐక్యత దేశానికి ఎంతో అవసరమని అన్నారు. ఆర్యవైశ్యులు అన్నిరంగాల్లో రాణించాలని, కల్వ సుజాత తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజా శ్రీరాంభూపాల్, కేశం నాగరాజుగౌడ్, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, నాయకులు పరమేష్, తులసీరాజ్, చెన్నయ్యసాగర్, నిర్వాహకులు రమేష్శెట్టి, సత్యనారాయణ, యాదగిరిశెట్టి, బాలీశ్వర్, కల్వ రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.


