
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
వీపనగండ్ల: వేసవిలో ప్రజలకు తాగునీరు అందించడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మేఘారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫిల్టర్బెడ్లు, గోపల్దిన్నె రిజర్వాయర్ అవుట్ఫాల్, ఇన్ఫాల్ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. గ్రామాల్లోని పంచాయతీ సిబ్బంది క్లోరినేషన్, వాటర్ ట్యాంక్లు శుభ్రపర్చడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదన్నారు. గోపల్దిన్నె రిజర్వాయర్లోని ఫిల్టర్బెడ్స్ నుంచి పాన్గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని.. రిజర్వాయర్లో నీటినిల్వపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ అమిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.