విజయనగరం గంటస్తంభం: హక్కుల సాధన కోసం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. ఇచ్చిన హామీ మేరకు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జోన్–1 సచివాలయ ఉద్యోగ సంఘాల సమైక్య(ఎస్జీఎస్డబ్ల్యూ) ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం కలెక్టరేట్ వేదికగా ఆందోళన చేశారు. రాత్రి 9.30 గంటల వరకు బైఠాయించి తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ తొలుత డీఆర్వో సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేసీ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. జేసీ వచ్చేవరకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళన కొనసాగించారు. జేసీ వచ్చాక సమస్యలను వినిపించి వినతిపత్రం అందజేశారు. గతంలో చేపట్టిన దీక్షల సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ వారం రోజుల్లో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, గడువు ముగిసినా నేటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని సంఘ నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న తమను విస్మరించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ మహిళా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
హామీలు ఇచ్చి చేతులెత్తేస్తే ఎలా?
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. గతంలో దీక్షలు చేసినప్పుడు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చి విరమింపజేశారు. నేటీకీ ఎలాంటి స్పందన లేదు.
– బి.శంకరరావు, జేఏసీ రాష్ట్ర సభ్యుడు
ఏళ్ల తరబడి పెండింగ్లో పెడతారా?
గత కొన్నేళ్లుగా మా సర్వీసు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రొబేషన్ పూర్తయిన 9 నెలల బకాయి వేతనాలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మా న్యాయమైన హక్కులు. వీటిని తక్షణమే పరిష్కరించాలి.
– వి.కాశీనాయుడు, జేఏసీ జిల్లా సభ్యుడు
డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి
వార్డుల్లో ప్రజా సేవలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం. కనీస బేసిక్ పే రూ.30,000 అమలు చేయడం, శాఖాపరమైన ప్రమోషన్లు కల్పించడం వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.
– ఆర్.శివప్రసాద్, వార్డు జేఏసీ విజయనగరం
హక్కుల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
రాత్రి 9.30 గంటల వరకు బైఠాయింపు
జేసీకి వినతిపత్రం అందజేసిన
ఉద్యోగ సంఘ నాయకులు


