కావాలనే కాలయాపన..
చంద్రబాబు సర్కారుపై..
● మొదలైన ఉద్యోగుల ఉద్యమ శంఖారావం ● నీటి మూటలుగా బాబు హామీలు ● 29 డిమాండ్లతో పోరుబాట
పార్వతీపురం రూరల్:
ఎన్నికలవేళ ఇచ్చిన పచ్చని హామీలు ఆచరణకు నోచుకోకపోవడంతో చంద్రబాబు సర్కారుపై ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం భగ్గుమంటోంది. డిమాండ్ల పరిష్కారం, హామీల అమలులో నిర్లక్ష్యంపై నిరసిస్తూ ఉద్యమశంఖారావం పూరించింది. విజయవాడలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం శుక్రవారం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో.. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ ఉద్యోగులు పోరుబాట పట్టేందుకు సన్నద్ధమయ్యారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి...
‘సీఎం సార్.. మా డబ్బులు మాకు చెల్లించండి’ అనే నినాదంతో సర్కారు తీరును ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. పీఆర్సీ కమిషనర్ నియామకం, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవులు, గ్రాట్యుటీ సహా రూ.40 వేల కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిల చెల్లింపు తదితర 29 ప్రధాన డిమాండ్లతో కార్యాచరణ రూపొందించారు. ఎన్ని వినతులు ఇచ్చినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఆగస్టు 31 నుంచి జిల్లావ్యాప్తంగా దశలవారీ ఆందోళనలకు పిలుపునిచ్చారు. తొలిదశలో నల్లబ్యాడ్జీలతో విధుల హాజరు, లంచ్ అవర్ నిరసనలు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి రెండో దశలో భాగంగా ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకే విధులు నిర్వహించి ధర్నాలకు దిగనున్నారు. అప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోతే.. మూడో దశలో సహాయ నిరాకరణ, నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ఈ ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే ఆ పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఏపీజేఏసీ అమరావతి నేతలు హెచ్చరించారు.
ప్రభుత్వం కావాలనే చర్చల పేరుతో మా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తోందన్న భావన క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యోగిలోనూ బలంగా నాటుకుపోయింది. పిలిచి మాట్లాడటమే తప్ప, మా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ శూన్యం. ‘ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని కేవలం మాటలు చెప్పడం కాదు.. ముందుగా మా న్యాయమైన హక్కులను కాపాడాలి. మా డబ్బులు మాకు చెల్లించడానికి ఇన్ని చర్చలు ఎందుకు? ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే.. కార్యచరణ దాల్చిన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.
– డి.జి.ప్రసాదరావు, సెక్రటరీ జనరల్ ఏపీ జేఏసీ, పార్వతీపురం మన్యం జిల్లా


