● ఏపీ పాలరైతు సంఘం డిమాండ్
శృంగవరపుకోట: విశాఖ డెయిరీలో జరిగిన అవినీతిపై హౌస్కమిటీ ఇచ్చిన రిపోర్టు బయట పెట్టి దోషులను తక్షణం శిక్షించాలని ఏపీ పాలరైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎన్జీఓ హోమ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ పాడి రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు, జిల్లా కార్యదర్శి గొంప కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు లోకవరపు ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ డెయిరీలో 6 జిల్లాలకు చెందిన 3.5 లక్షల మంది రైతులు రోజుకు 9 లక్షల లీటర్ల పాలు పోస్తుంటే వాటిని మార్కెట్ చేసి, లాభాలను డెయిరీ యాజ మాన్యం దారి మళ్లిస్తూ, రైతులకు నష్టాలు మిగులుస్తోందని ఆరోపించారు. రైతులు శ్రమకోర్చి పెట్టుబడులు పెట్టి పాడి పశువులను పోషిస్తున్నారు. గడ్డి, దాణా, మందులు, గర్భధారణ వంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నా ఆ నిష్పత్తిలో పాల సేకరణ ధర పెంచాలని రైతాంగం కోరుతున్నా పట్టించుకోని యాజమాన్యం వినియోగదారులకు ఏటా అమ్మకం ధర పెంచుతోందన్నారు. ఏడాదికి సుమా రు రూ.500 కోట్లకు పైనే ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెయిరీలో జరుగుతున్న అవినీతిలో 20 అంశాలను గుర్తించి వాటికి ఏపీ పాల రైతు సంఘం, విచారణ కోరితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అరుగురు శాసన సభ్యులతో హౌస్ కమిటీ వేసి 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. హౌస్కమిటీ ఏది తర్వాత రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చినా, ప్రభుత్వం ఆ రిపోర్టును బయటపెట్టకుండా, అంటిపెట్టుకుందన్నారు. డెయిరీ అవినీతికి కేంద్రబిందువుగా ఉన్న చైర్మన్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నందున, ఆయనపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని ధ్వజమెత్తారు.
19న ధర్నా
డెయిరీకి వస్తున్న మిగులు ఆదాయం రైతులకు బోనస్గా ఇచ్చి, లీటరు పాలకు రూ.10 సేకరణ ధర పెంచి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరు తూ ఆగస్టు 19న ఉదయం 10గంటలకు విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్న నిరసనలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాడి రైతులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు గేదెల శ్రీను, సిటు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, మంచిన రాంబాబు, సీహెచ్.ముత్యాలు, నత్తల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


