● 2027 నాటికి తలసరి ఆదాయం రూ.55 లక్షలకు చేరేలా కృషి చేయాలి
విజయనగరం గంటస్తంభం: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అధికారులు సమష్టిగా, చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రత్యేక కార్మదర్మి శాంతిప్రియ పాండే సూచించారు. 2027 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రణాళికా విభాగం, పాలే ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులకు గురువారం సామర్థ్యపెంపు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ), జిల్లా స్థూల ఉత్పత్తి పెంపుపై క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన అవగాహన అవసరమన్నారు. ప్రాథమిక, పారిశ్రామిక, సేవారంగాల్లో ఉత్పత్తి, పెట్టుబడులు, ఆదాయ వృద్ధిపై దృష్టి సారించి ఆర్ధికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చే దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రణాళికా శాఖ డిప్యూటీ స్టాటిస్టకల్ అధికారి రమేష్, ధార్వాడ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేష్ ఉత్పత్తి, పెట్టుబడి, రాబడి తదితర ఆర్థిక అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సేఽతుమాధవన్, సీపీఓ బాలాజీతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


