న్యూస్రీల్
సాంకేతిక ఇబ్బందుల్లో
ఆన్లైన్ ప్రక్రియ
వలస ఓటర్లలో తీవ్ర ఆందోళన సాంకేతిక ఇబ్బందుల్లో ఆన్లైన్ ప్రక్రియ 89.89 శాతానికి చేరిన డిజిటలైజేషన్ 91 శాతంతో ముందు వరుసలో చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలు
89.89 శాతానికి చేరిన డిజిటలైజేషన్
విజయనగరం
సోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026
కురుపాం మండలంలోని తూర్పుముఠా ప్రాంతమైన జరడ, తిత్తిరి పంచాయతీల్లో మూడు రోజులుగా ఏనుగుల ఘీంకారం గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది. –8లో
విజయనగరం అర్బన్:
జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ సరిహద్దు జిల్లాల వలస ఓటర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల రీత్యా విశాఖ, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో స్థిరపడిన విజయనగరం జిల్లా ప్రజలు తమ ఓటు హక్కు ఎక్కడ గల్లంతవుతుందోననే భయంతో కొట్టుమిట్టాడుతున్నారు. క్షేత్ర స్థాయిలో సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలం కావడంతో ఎన్యూమరేషన్ ప్రక్రియ లక్ష్య సాధనలో కొంతమేరకు జాప్యం తప్పడం లేదని తెలుస్తోంది.
ఇంటి వద్దే మూలుగుతున్న పత్రాలు
కుటుంబ సభ్యులు స్వయంగా వచ్చి బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వాలా? వద్దా? అనే సందేహాలపై అధికారులు ముందే స్పష్టత ఇవ్వకపోవ డంతో వలస వెళ్లిన చాలా కుటుంబాలు ఆ పత్రాల ను ఇళ్లలోనే దాచేసుకుంటున్నాయి. దీనివల్ల డిజిట లైజేషన్ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదనే సందేహాలు వస్తున్నాయి. చివరి నిమిషంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి.. ‘ఓటరు స్వయంగా రావాల్సిన అవసరం లేదు, కుటుంబ సభ్యుల సంతకం లేదా వేలిముద్ర ఉంటే చాలు’ అని వివరణ ఇచ్చినప్పటికీ ఈ సమాచారం ఇంకా క్షేత్ర స్థాయికి పూర్తి స్థాయిలో చేరలేదు. దీనికి తోడు పత్రంపై తాజా ఫొటో తప్పనిసరి చేయడంతో దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఆ ఫొటోలను పంపలేక ఇబ్బందులు పడుతున్నారు.
సెలవులూ లేవు.. ప్రశాంతత లేదు..
ముఖ్యంగా దూర ప్రాంతాల్లో జీవనోపాధికి వలసపోయిన రాజాం, బొబ్బిలి ప్రాంతాలకు చెందిన వివిధ వర్గాల ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ అయోమయంగా మారింది. పత్రాలు సమర్పించడానికి ఈ నెల 14 తేదీయే చివరి గడువు కావడంతో వలస ఓటర్లలో అయోమయం నెలకొంది. సొంత ఊళ్లలోని కుటుంబ సభ్యులు ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తుండటంతో వీకెండ్ సెలవులను కూడా త్యాగం చేసి ఊర్ల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడువు ముగిసిపోతే ఓటు గల్లంతవుతాయనే ఆలోచనతో వందలాది మంది కిలోమీటర్ల దూరం ప్రయాణించి గ్రామాలకు చేరుకుంటున్నారు.
మరోవైపు అధికారులు ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నా ఆ ప్రక్రియ సగటు ఓటరుకు నరకం చూపిస్తోంది. ‘ఓటర్స్.ఈసీఐ.జీవోవి.ఐఎన్’ వెబ్సైట్లో లాగిన్ అవ్వడం, ఓటీపీలు రాకపోవడం, సర్వర్ల మెరాయింపు వంటి సాంకేతిక సమస్యలు ఓటర్లను విసిగిస్తున్నాయి. వీటన్నింటికీ తోడు 2002 నాటి ఓటర్ల జాబితాల్లో పేరును మ్యాపింగ్ చేసుకోవాలనే నిబంధన పెద్ద తలనొప్పిగా మారింది. పాతికేళ్ల క్రితం నాటి వివరాలు, పాత నియోజకవర్గాల వివరాలు గుర్తులేక, అప్పట్లో ఓటు లేని యువత తమ తల్లిదండ్రులు, తాతల వివరాల కోసం వెతుక్కోవాల్సి రావడం గమనార్హం. ‘ఓటు గల్లంతు కాదు’ అని పైకి భరోసా ఇస్తున్నప్పటికీ క్లిష్టమైన నిబంధనలు, ఆన్లైన్ వెబ్సైట్ సమస్యలు, తాజా ఫొటోల నిబంధనల వల్ల క్షేత్ర స్థాయిలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో 15,78,949 ఓట్ల కోసం చేపడుతున్న సర్ కార్యక్రమం ముగించడానికి ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఆదివారం నాటికి 89.89 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. ఏడు నియోజకవర్గాల్లోని చీపురుపల్లి 91.35 శాతం, గజపతినగరం 91.01 శాతంతో ముందు వరుసలో ఉన్నాయి. బొబ్బిలి 87.46 శాతం, రాజాం 88.46 శాతం మాత్రమే చేసి చివరి స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన మూడు నియోజకవర్గాలు నెల్లిమర్ల, విజయనగరం, ఎస్.కోటలో 90 శాతం దాటాయి.


