● తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో.. మహిళ ఆత్మహత్య
పార్వతీపురం రూరల్:
ఆ మహిళకు ఏ కష్టం వచ్చిందో? ఏ రకమైన ఇబ్బందులు పడిందో తెలియదు.. కానీ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కొమరాడ మండలం లొద్ద గ్రామానికి చెందిన బుజ్జమ్మ ఉరి వేసుకుని కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పెద్ద మర్రి చెట్టుకు బుజ్జమ్మ ఉరి వేసుకుని వేలాడు తూ ఉండడాన్ని ఆదివారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఆమె ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు వద్దకే వచ్చి ఎందుకు బలవన్మరణానికి పాల్పడిందనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి భర్త గతంలోనే చనిపోయాడు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. పెద్ద కుమారుడు సత్తిబాబు ఇంటర్ వరకు చదువుకున్నాడు. రెండోవాడు వంశీ చదువు మధ్యలో ఆపేశాడు. అమ్మాయి జాను కూలి పనులకు వెళ్తుంది. చివరివాడు గోపాల్ మూడో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు.


