జానకమ్మ మృతి
సంగీత రంగానికి తీరనిలోటు
మధురగాయని, కలైమామణి డాక్టర్ ఎస్.జానకమ్మ సాయంత్రం శివైఖ్యం పొందారన్న వార్త వినడం హృదయ విదారకరం. బరువెక్కిన హృదయంతో సాక్ష్యాత్తు తల్లిని కోల్పోయిన బాధతో అమ్మకు నివాళులర్పిస్తున్నాను. కళాపీఠం తరఫున ఆమెకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశాం. అటువంటి అమ్మను కోల్పోవడం బాధాకరం.
– బి.ఎ.నారాయణ, శ్రీ గురునారాయణ
కళాపీఠం, విజయనగరం
విజయనగరం టౌన్: ‘అరే ఏమైందీ.. అరె ఎమైందీ.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరిందీ’... గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండున్నాయని’ పాడిన మధురగానం మూగబోయిందన్న వార్త తెలుగు సినీలోకాన్ని కలిచివేసింది. ఆమె పాట మధురం. ఆమె ఇక లేరన్న విషయం తెలుసుకున్న విజయనగరంలోని సంగీతాభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. డాక్టర్ ఎస్.జానకమ్మ శనివారం సాయంత్రం శివైక్యం చెందారనే వార్తతో సంగీతప్రియులు ద్రిగ్భాంతి చెందారు. విజయనగరంతో ఆమెకు ఎనలేని బంధం ఉంది. ఇక్కడి శ్రీ గురునారాయణ కళాపీఠం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. కళాపీఠం తరఫున జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆత్రేయ కళాపీఠం సభకు 25 ఏళ్ల కిందట వచ్చినట్లు సమాచారం. 2006లో ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య తరఫున మధురగాయని ఎస్.జానకి సరిలేరు నీకెవ్వరూ అంటూ ‘కోకిలమ్మ’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
జానకమ్మ మృతికి సంతాపం
జానకమ్మ మృతిపై ఘంటసాల స్మారక కళాపీఠం వ్యవస్థాపకుడు ఎమ్.భీష్మారావు, ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ డాక్టర్ మండపాక రవి, ఘంటసాల సంగీత, సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్, గురునారాయణ కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ జి.సన్యాసమ్మ, విజయభావన ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.గోపాలరావు, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, ధవళ సర్వేశ్వరరావు, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి తదితరులు సంతాపం తెలిపారు. సంగీత ప్రపంచానికి ఆమె లేని లోటు తీర్చలేనిదన్నారు.
కలైమామణి జానకమ్మ శివైక్యం
విజయనగరమంటే ఆమెకు ఎనలేని ప్రీతి
ఏప్రిల్ ఒకటో తేదీన పైడితల్లిని
దర్శించుకున్న జానకమ్మ
శోకసంద్రంలో సంగీతాభిమానులు


