విజయనగరం అర్బన్: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో నడుస్తున్న ఎనిమిది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 13న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయ అధికారి ఎస్.రూపవతి శనివారం తెలిపారు. అర్హులైన విద్యార్ధులు సమన్వయ అధికారి కార్యాలయం వద్దకు నేరుగా హాజరై తక్షణమే సీటు పొందవచ్చనని ఆమె పేర్కొన్నారు. వంగర బాలికల పాఠశాలల్లో ఐదో తరగతిలో 39, నెల్లిమర్లలో 21, వేపాడలో 27, వియ్యంపేటలో 42 ఖాళీలు ఉన్నట్టు తెలిపారు. బాలుర పాఠశాలలకు సంబంధించి పాలకొండలో 15, బాడంగిలో 34, కొప్పెర్లలో 56 సీట్లు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్కు సంబంధించి నెల్లిమర్ల బాలికల కళాశాలలో 43(ఎంఈసీ, సీఈసీ), వియ్యంపేటలో 46(ఎంఈసీ, సీఈసీ), బాలుర కళాశాలల్లో పాలకొండలో 50(ఎంఈసీ, సీఈసీ), కొప్పెర్లలో 46(ఎంపీసీ, బైపీసీ) సీట్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు స్థానిక డీఆర్డీఏ ప్రాంగణంలో ఉన్న జిల్లా సమన్వయ అధికారి కార్యాలయానికి విద్యార్థి, తల్లిదండ్రులతో కలిసి ఆధార్ కార్డులతో హాజరు కావాలని సూచించారు.


