ధాన్యం సేకరణపై విచారణ
విజయనగరం ఫోర్ట్: తేమశాతం పేరుతో అదనంగా రైతుల నుంచి మిల్లర్లు ధాన్యం తీసుకుంటున్నారనే అంశంపై ‘రైతు కష్టం మిల్లర్ల పాలు..!’ అనే శీర్షికన ‘సాక్షిలో’ శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో సీఎస్డీటీ మూర్తి విచారణ చేపట్టారు. రావివలస వద్ద ఉన్న కనకదుర్గ మిల్లు యాజమాని అదనంగా ధాన్యం తీసుకున్నట్టు రైతులు కరకనాయుడు, పి.దేముడు లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు.
మడ్డువలస నీరు విడుదల
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా రబీ సీజన్కు ప్రాజెక్టు సిబ్బంది శనివారం సాగునీరు విడుదల చేశారు. తొలిరోజు 200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టగా అవసరం మేరకు నీటి సరఫరా పెంచనున్నారు. ఈ సీజన్లో ఆరుతడి పంటలు వేసుకోవాలని సిబ్బంది రైతులను సూచించారు. ఆయకట్టు పరిధిలో వంగరలో 996 ఎకరాలు, రేగిడి ఆమదాలవలసలో 6,777 ఎకరాలు, సంతకవిటిలో 6,599 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 3,029 ఎకరాలు, పొందూరులో 99 ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.
ఉడకని అన్నం.. రుచిలేని కూర..?
● పోటీల నిర్వహణకు ఏర్పాట్లు లేమి
● ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి
క్రీడాపోటీల నిర్వహణపై అసంతృప్తి
విజయనగరం: ఉపాధ్యాయుల క్రీడాపోటీల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్భాటం ఎక్కువ... సౌకర్యాలు తక్కువ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పురుషుల విభాగంలో క్రికెట్, సీ్త్రల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి విజేతలకు విజయనగరం విజ్జి స్టేడియం వేదికగా శని, ఆదివారం డివిజిన్ స్థాయి పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం రూ.20వేలు చొప్పున కేటాయించారు. విజయనగరం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన క్రీడా పోటీల నిర్వహణపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. నిర్దేశిత సమయానికి పోటీలు ప్రారంభించకపోవడం, కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. క్రికెట్ పోటీల్లో కార్క్ బాల్ను వినియోగించగా... అందుకు అవసరమైన బ్యాట్లు, ప్యాడ్లు, హెల్మెట్, గార్డ్స్ వంటి పరికరాలు సమకూర్చలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన పోటీలను 11 గంటల వరకు ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం అల్పాహారం ఏర్పాటు చేయకపోగా... మధ్యాహ్నం భోజనం కూడా ఉడకని అన్నం... సాంబారు, ఒక్క కూరతో వడ్డించడాన్ని ఆక్షేపించారు. మొదటి రోజు పోటీలను ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ప్రారంభించారు.
ధాన్యం సేకరణపై విచారణ
ధాన్యం సేకరణపై విచారణ
ధాన్యం సేకరణపై విచారణ


