భయపెడుతున్న స్క్రబ్ టైఫస్..!
● జిల్లాలో 10 కేసుల నమోదు
● ఆందోళన చెందుతున్న జనం
● సకాలంలో చికిత్స తీసుకోవాలంటున్న వైద్యులు
విజయనగరం ఫోర్ట్: జిల్లా ప్రజలను స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో జనం భయాందోళన చెందుతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. చీపురుపల్లి, బొండపల్లి, గరివిడి తదితర మండలాల్లో కేసులు బయటపడ్డాయి. వ్యాధి నివారణకు సకాలంలో వైద్యసేవలు పొందడంలో అలసత్వం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉండడంతో భయపడుతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పురుగులు కరిచినప్పుడు వ్యాధి వ్యాప్తి :
మైట్స్ అనే చిన్న పురుగులు కరిచినప్పడు స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, కళ్లు ఎర్రబడినట్టు కనిపించడం, దగ్గు, శ్వాసలో స్వల్ప ఇబ్బంది, పొట్టలో అసౌకర్యం వ్యాధి లక్షణాలు. పురుగు కరచినచోట చిన్న నల్లమచ్చ లేదా గాయం లాంటి బొట్టు కనిపిస్తుంది. ఇది దుస్తులు కింద ఉండే భాగాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి ఉండదు. శరీరంలో ఎర్రబడిన దద్దర్లు వల్ల ఆహారం తినాలనిపించకపోవడం లాంటివి ఉంటాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి....
జ్వరం తగ్గక పోవడం, శ్వాసలో ఇబ్బంది, మతిమరుపు, గందర గోళం, మూత్రం తగ్గడం లాంటివి సంభవిస్తే వెంటనే ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలి.
సకాలంలో చికిత్స అవసరం..
వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. వ్యాధి పట్ల అలసత్వం వహించరాదు.


