విహారంలో విషాదం
● వంతెనను కారు ఢీకొని విద్యార్థి మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): విహారయాత్రకు వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతి చెందడంతో విషాదం నెలకొంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజనీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19) సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవల అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మృతుడు రుద్రసాయి విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందినవాడు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని పోస్ట్మార్టం గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబసభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.


