గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూలు
నెల్లిమర్ల: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ రేఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బోటనీ, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి సీనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎమ్మెస్సీలో 55 శాతం మార్కులు పొంది, పీహెచ్డీ, నెట్క్వాలిఫై అయిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కళాశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాలని కోరారు.
డీఎల్డీఓ కార్యాలయం ప్రారంభం
విజయనగరం రూరల్: స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జెడ్పీ నిధులు రూ.14.95 లక్షల వ్యయంతో నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి (డీఎల్డీఓ) కార్యాలయాన్ని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. అలాగే, బొబ్బిలి, చీపురుపల్లి డివిజన్ల పరిధిలోని డీఎల్డీఓ కార్యాలయాలను సైతం వర్చువల్గా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డీఎల్డీఓ రోజారాణి, జీఎస్డబ్ల్యూఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
అన్ని పంచాయతీల్లోనూ జనసేన పోటీ
దత్తిరాజేరు: వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని, అభ్యర్థులు సన్న ద్ధం కావాలని గజపతినగరం నియోజకవర్గం ఇన్చార్జి మర్రాపు సురేష్ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పడాల అరుణ, పార్టీ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు మామిడి దుర్గాప్రసాద్, మండలాధ్యక్షుడు చప్ప అప్పారావుతో కలిసి కోమటిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలోని కల్యాణమంటపంలో గురు వారం నిర్వహించిన ఆత్మీయ కలయిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా వెళ్లాలన్నారు. టీడీపీ నాయకుల వేధింపులు, అవమానాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
అలిగితే నష్టపోయేది మనమే..
● పార్టీ శ్రేణులకు లోకేశ్ సూచన
సాక్షి, పార్వతీపురం మన్యం: టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతమని పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. భామినిలో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన గురువారం మాట్లాడారు. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనని, గ్రూపు రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించారు. ప్రతి పనికి లోకేశ్, ఎమ్మెల్యే ఫోన్ చేయాలంటే కుదరదు. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రి అచ్చెన్న కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలివ్వాలి అంటూ లోకేశ్ చెప్పడం గమనార్హం.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఇంటర్వ్యూలు


