
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
లీప్ యాప్ ప్రామాణికంగా..
వీరఘట్టం: ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారు చేసిన సేవలకు గాను మండల, జిల్లా, రాష్ట్ర,జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ప్రతి ఏటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా సత్కరిస్తుంటాయి. ఈ ఏడాది కూడా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించేందుకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తమ టీచర్ల ఎంపికకు ‘లీప్’ యాప్ను ప్రామాణికంగా చేస్తూ తీసుకువచ్చిన నూతన విధానాన్ని టీచర్లతో పాటు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
లీప్ యాప్ ప్రాధాన్యతపై గుర్రు..
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ప్రస్తుతం లీప్ యాప్ ఎంతో కీలకం. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, విద్యార్ధుల పురోగతి పర్యవేక్షణ, తల్లిదండ్రులతో సమావేశాలు, విద్యార్థుల వ్యక్తిగత సంరక్షణ, విద్యార్ధుల గ్రీన్ పాస్పోర్టు తదితర కార్యక్రమాలన్నీ ఈ యాప్ ద్వారానే నిర్వహిస్తున్నారు. పాఠశాలలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన టీచర్ లేదా..విద్యార్థులతోనైనా ఈ పనులు చేయిస్తుంటారు. అలాంటప్పుడు ‘లీప్’ యాప్ నిర్వహణను ప్రామాణికంగా తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు,టీచర్లు గుర్రుగా ఉన్నారు.
వారంతా బెస్ట్ టీచర్లా?
ప్రతి రోజు స్కూల్ వేళకు వచ్చి ఆన్లైన్లో అటెండెన్స్ వేసిన ఉపాధ్యాయులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.అయితే కొందరు టీచర్లు ఉదయం 8.30 గంటలకు పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటల వరకు ఉండి చదువే చెప్పకుండా యాప్లో మాత్రం కచ్చితంగా అటెండెన్స్ వేసే వారు అక్కడక్కడా ఉన్నారు. ఇంకొందరు పాఠశాలకు ఉదయం వెళ్లి యాప్లో అటెండెన్స్ వేసి బయటకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు మళ్లీ వెళ్లి ‘ఔట్’ అటెండెన్స్ వేస్తున్నారు. ఇలాంటి వారు బెస్ట్ టీచర్లు ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. లీప్ యాప్ ప్రామాణికంగా తీసుకుని రాష్ట్రస్థాయి సాంకేతిక నిపుణులు ప్రతి జిల్లాకు 16 మంది టీచర్లను ఎంపిక చేసి వారి జాబితాలను పంపినట్లు సమాచారం. వారందరినీ జిల్లాస్థాయి అవార్డుకు ఎంపిక చేసేలా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. లీప్ యాప్ ప్రామాణికంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేయాలనే నిర్ణయం సరికాదని, ఈ విషయంలో అధికారులు పునరాలోచించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఈనెల 21 నుంచి 23 లోపు గుర్తింపు
25న జాబితా ప్రకటన
రాష్ట్రస్థాయికి ఒక్కో జిల్లా నుంచి
8 మంది ఎంపిక
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రభుత్వ నిర్ణయం నరైంది కాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు
విశిష్ట సేవలు అందిస్తున్న టీచర్లను పారదర్శకంగా గుర్తించాలని
డిమాండ్
ఈ విధానం సరైంది కాదు
లీప్ యాప్ ప్రామాణికంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు టీచర్లను గుర్తిస్తామనడం సరైన విధానం కాదు. గ్రౌండ్ లెవెల్లో చాలా మంది ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.అటువంటి వారిని పారదర్శకంగా గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేయాలి.
– మండల మురళి, ఏపీటీఎఫ్,
మండలశాఖ అధ్యక్షుడు, వీరఘట్టం

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక