తగరపువలస: హరేకృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు, హరేకృష్ణ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల 130వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భక్తులు ఆయనకు శనివారం 4311 రకాల వంటకాలను సమర్పించారు. ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠంలో వ్యాసపూజ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాధా మదన మోహనుల మందిరంలో ప్రభుపాదుల వారి వ్యాసపూజ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనను స్మరించుకున్నారు.శ్రీకృష్ణ జన్మాష్టమి అనంతరం ఈ కార్యక్రమాన్ని గురుదక్షిణగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుపాదుల వారిని గురువుగా స్వీకరించిన భక్తులు ఆయన విగ్రహం ముందు వివిధ రకాల వంటకాలను ఉంచి పూజలు నిర్వహించారు.హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు నిష్క్రించిన భక్తదాస మాట్లాడుతూ.. భక్తులు తమ ఇళ్ల వద్ద శుచి, శుభ్రతతో రుచికరమైన సాత్విక, తీపి పదార్థాలను తయారు చేసి సమర్పిస్తారని తెలిపారు. గురువుకు సమర్పించిన అనంతరం హారతి నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.


