సీతంపేట: ఉత్తరాంధ్ర చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ‘కీర్తిచక్ర’ పందిళ్లపల్లి శ్రీనివాస్(ఐఎఫ్ఎస్) జయంతి వేడుకలను శనివారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. కర్ణాటక కేడర్కు చెందిన అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ తన సేవా కాలంలో అటవీ సంరక్షణలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రత్యేక గుర్తింపు పొందారని వక్తలు కొనియాడారు. ఆయన చిత్ర పటానికి సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు తిరుపతి రాజమన్నారు మాట్లాడుతూ గంధం చెక్కల, ఏనుగు దంతాల స్మగ్లింగ్తో మూడు రాష్ట్రాలను వణికించిన వీరప్పన్ను ధైర్యంగా ఎదుర్కొన్న అధికారి శ్రీనివాస్ అని కొనియాడారు. శాంతిచర్చల పేరుతో పిలిచి కిరాతకంగా హత్య చేసిన ఘటనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సోదరీమణులు రామలక్ష్మి, రాజ్యలక్ష్మి పాల్గొని భావోద్వేగంతో నివాళులర్పించారు. ఇదే వేదికపై సంఘ పూర్వ అధ్యక్షులు గోపాలకృష్ణ, లక్ష్మణమూర్తిని ఘనంగా సత్కరించారు. పరవస్తు సూరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి శతపత్రం వెంకటేశ్వర్లు అనుసంధానకర్తగా వ్యవహరించారు. పలువురు వైష్ణవ బంధువులు, పుర ప్రముఖులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


