ప్రైజం ఆర్ఎంసీ కంపెనీ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
అక్కిరెడ్డిపాలెం : ఆటోనగర్ డీ బ్లాక్ మ్యాంగ్ పార్క్ ఎదురుగా ఉన్న ప్రైజం ఆర్ఎంసీ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు చేరుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి ప్రాంతానికి చెందిన మాటూరి చిన్నరావు (38) ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఆయన తల్లి ఇటీవల మృతి చెందడంతో కుటుంబ బాధ్యతల నిమిత్తం ఆటోనగర్లోని ప్రైజం ఆర్ఎంసీ సిమెంట్ పరిశ్రమలో వెల్డింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో భాగంగా వెల్డింగ్ పనులు చేస్తుండగా పరిశ్రమలోని విద్యుత్ పరికరాల నుంచి ఒక్కసారిగా ఎర్త్ రావడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజులుగా పరిశ్రమలో విద్యుత్ షాక్ వస్తున్న విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తోటి కార్మికులు ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నరావు మృతి చెందారని వారు తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని బంధువుల, కార్మికులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేశారు. పరిశ్రమ గేటు వద్ద ఆందోళన కొనసాగించారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు పరిశ్రమ యాజమాన్యాన్ని విచారించారు. యాజమాన్య ప్రతినిధులు బెంగళూరు నుంచి రావాల్సి ఉందని, వారు వచ్చిన అనంతరం పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని పోలీసులకు తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


