సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలతో ఉడికిపోతున్న విశాఖ నగరంలో గురువారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడి ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఒక్కసారిగా ఆకాశంలో దట్టమైన మేఘా లు కమ్ముకున్నాయి. నగరమంతటా సుమారు మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వన్టౌన్, కాన్వెంట్ జంక్షన్, బీచ్ రోడ్డు, అక్కయ్యపాలెం, సీతమ్మధారతో పాటు జాతీయ రహదారి కూడా వర్షపు నీటితో చెరువులను తలపించాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.


