మహారాణిపేట: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ అభివృద్ధి, సాంస్కృతిక వైభవం, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను ప్రతిబింబించేలా వినూత్న శకటాలు, ఆకర్షణీయ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. వేడుకల ప్రాంగణంలో వివిధ శాఖల అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేదిక, సీటింగ్, ధ్వని వ్యవస్థ తదితర ఏర్పాట్లను నాణ్యంగా పూర్తి చేయాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందిని పురస్కారాలకు సిఫారసు చేయాలని, ఆహ్వాన పత్రికలు, ప్రోటోకాల్ ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.


