ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల ప్రారంభం
అల్లిపురం: ద్వారకా బస్సు స్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ డోర్ డెలివరీ మాసోత్సవాలను విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. విజయగీత శనివారం ప్రారంభించారు. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రైవేట్ సంస్థల తరహాలోనే ఆర్టీసీ కూడా 2021 సెప్టెంబర్ నుంచి డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. ఈ సదుపాయం గురించి వినియోగదారులకు విస్తృతంగా తెలియజేయడమే ఈ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. తక్కువ ధరలకే సులభంగా పార్సిళ్లను ఇంటి వద్దకే చేరవేస్తున్న ఈ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా ప్రజారవాణా అధికారి బి. అప్పలనాయుడుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


