
కాగితాలపైనే వేగం
విశాఖ మెట్రో ప్రాజెక్ట్పై
కన్సల్టెన్సీ అసహనం
జిల్లా అధికారులతో
సంప్రదింపులు జరిపిన ‘శిస్త్రా’
ప్రాజెక్ట్ పర్యవేక్షణ,
సాంకేతిక సహకారంపై ఆరా
భూసేకరణ మొదలు కాకపోతే
రిపోర్ట్ ఎలా సిద్ధం చేయగలమని
ప్రశ్నించిన సంస్థ
టెండర్లు పిలవడంతో
కూటమి ప్రభుత్వంపై విమర్శలు
క్షేత్రస్థాయిలో
శూన్యం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ‘అదిగో పులి..’ అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వ వైఖరి. పనులకు క్షేత్రస్థాయిలో అంకురార్పణ జరగకముందే అంతా సిద్ధమైనట్లుగా ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించకుండా.. నిధులపై స్పష్టత ఇవ్వకుండానే టెండర్లు ఆహ్వానించి, జనరల్ కన్సల్టెంట్ను కూడా నియమించేశారు. ప్రాజెక్టు డిజైన్, నిర్వహణ, నాణ్యత పర్యవేక్షణ కోసం ఒప్పందం కుదుర్చుకున్న ‘శిస్త్రా’సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. మెట్రో మార్గానికి సంబంధించిన వివరాలు, భూసేకరణ పురోగతిపై ఆరా తీయగా.. అధికారులు నీళ్లు నమలడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రాథమిక సమాచారం కూడా లేకుండా నిర్ణీత గడువులోగా నివేదికలు ఎలా సిద్ధం చేయగలమని.. ‘ఏమీ లేకుండా మేమేం చేయగలం?’అంటూ శిస్త్రా సంస్థ ప్రతినిధులు నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులు ‘మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి’ అన్నట్లు తయారైంది. ఆ మూడడుగులు కూడా కూటమి ప్రభుత్వ ప్రచార ఆర్భాటం తప్ప.. వాస్తవ పనుల్లో పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నెల రోజుల కిందట తొలి దశలో 46.23 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టుకు రూ.6,250 కోట్లతో(జీఎస్టీ అదనం) ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని అందులో పేర్కొంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ మేర చేపట్టనుండగా.. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించాలనుకుంటున్నారు. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకు పై వంతెనల నిర్మాణం చేపడతారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్, గురుద్వార–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య ఏర్పాటు చేసే 34.40 కిలోమీటర్ల కారిడార్లో డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిమీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ మధ్య మరొక కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.
మెట్రో రైల్ ప్రాజెక్టు డిజైన్
భూసేకరణ పూర్తికాకుండానే
పనులెలా?
టెండర్లు ఖరారు చేశాక 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కాగా.. రెండు నెలల కిందట సాంకేతిక సహకారం, ప్రాజెక్టు పర్యవేక్షణ, నాణ్యత పరిశీలన కోసం శిస్త్రా సంస్థతో ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇటీవల జిల్లా యంత్రాంగం, మెట్రో అధికారులతో శిస్త్రా సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ పనులు ఎంతవరకు వచ్చాయనే విషయంపై ఆరా తీశారు. అయితే ఇప్పటివరకు కేవలం ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే జరిగిందని తెలియడంతో శిస్త్రా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేశారు. టెండర్లు ఖరారయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు చెప్పడంపై వారు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రెండు దశలకు కలిపి మొత్తం 99.75 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, అందులో 9.22 ఎకరాల ప్రైవేట్ భూమి ఉంది. కొద్ది సమయంలో ఇంత పెద్ద ప్రక్రియ పూర్తి చేయడం అసాధ్యమని, కనీస సమాచారం లేకుండా తాము నివేదికలు ఎలా ఇవ్వగలమని శిస్త్రా సంస్థ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక కిలోమీటర్ ఫ్లైఓవర్ నిర్మాణానికే రెండేళ్లకు పైగా పడుతుంది. అలాంటిది.. 46 కి.మీ మార్గం, 42 స్టేషన్లతో కూడిన తొలి దశను రెండున్నరేళ్లలో ఎలా పూర్తి చేస్తారు?’ అని వారు ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై పునరాలోచించుకోవాలని సలహా ఇచ్చినట్లు తెలిసింది. కేవలం ప్రచారం కోసమే.. క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి లేకుండా టెండర్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూటమి సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏమీ లేకుండా
మేమేం చేయగలం?

కాగితాలపైనే వేగం