
ఆహార ప్రయోగం..ఇంకెప్పుడు?
ఆహార పరీక్షల కేంద్రం లేని రాష్ట్రం ఏపీ పరీక్షలకు ఇతర రాష్ట్రాలపై ఆధారం పరికరాల కోసం రూ.కోట్ల ఖర్చు ప్రారంభించి ఏడాదిన్నర అవుతున్నా
బీచ్రోడ్డు: జీవనశైలి మార్పులతో పాటు కలుషితమైన ఆహారం నేటి తరంలో ఊబకాయం, క్యాన్సర్, షుగర్ వంటి వ్యాధులు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది. బయటి ఆహారంపై ప్రజలు ఆధారపడటంతో, ఆహార భద్రత పర్యవేక్షణ అత్యంత కీలకంగా మారింది. అయితే ప్రజారోగ్యానికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన స్టేట్ ఫుడ్ ల్యాబ్ ఇంకా అందుబాటులోకి రాకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
సొంత ల్యాబ్ ఎందుకు లేదు?
రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్టేట్ ఫుడ్ ల్యాబ్ను మంజూరు చేసింది. విశాఖలోని పెదవాల్తేరు ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ప్రాంగణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ని ర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. రెండేళ్ల కిందటే భవన నిర్మాణం పూర్తయింది. 2024 ఫిబ్రవరి 25న ప్రధాని మోదీ వర్చువల్గా ఈ ల్యాబ్ను ప్రారంభించారు. అయితే దాదాపు ఏడాదిన్నర కాలం గడిచినా ఈ ల్యాబ్ సేవలు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో 11 ఏళ్లుగా సొంత ఆహార పరీక్ష కేంద్రం లేని ఏకై క రాష్ట్రంగా ఏపీ నిలిచింది. చిన్న రాష్ట్రాలకు సైతం సొంత ల్యాబ్లు ఉండగా, ఏపీ మాత్రం తెలంగాణపై ఆధారపడటం విమర్శలకు దారితీస్తోంది.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రధాన మంత్రి ప్రారంభించిన కొద్ది రోజులకే ఎన్నికల కోడ్ అమలుల్లోకి వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ల్యాబ్పై దృష్టి పెట్టలేదు. ఈ నిర్లక్ష్యంపై కూటమిలో భాగమైన బీజేపీ నాయకులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ సేవలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం, అత్యాధునిక పరికరాలు నిరుపయోగంగా మారతాయని హెచ్చరిస్తున్నారు.
పరీక్షల కోసం కోట్ల వ్యయం
ఆహార భద్రత ప్రమాణాల శాఖ అధికారులు తనిఖీల్లో సేకరించిన నమూనాలను హైదరాబాద్కు పంపిస్తున్నారు. దీని వల్ల ఒక్కో నమూనాకు రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. నెలవారీగా ఈ ఖర్చు సుమారు రూ. 5 కోట్లకు చేరుతుందని అంచనా. ఇటీవల విశాఖలో 20 బృందాలు తనిఖీలు చేసి పంపిన 79 నమూనాలకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుంది. నమూనాలను ఇతర రాష్ట్రాలకు పంపడం వల్ల కమీషన్లు వస్తున్నాయని, అందుకే ఉన్నతాధికారులు ల్యాబ్ ప్రారంభం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మూలకు చేరిన పరికరాలు : ల్యాబ్లో ఆయిల్స్, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, చాక్లెట్స్, బిస్కెట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటి 17 రకాల ఆహార పదార్థాలను పరీక్షించేందుకు అవసరమైన 30 రకాల అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని పూర్తిగా ఇన్స్టాల్ చేయలేదు. ఈ ల్యాబ్ నిర్వహణకు అవసరమైన 70 మంది సిబ్బంది నియామక ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు.
రూ.110 కోట్లు కేటాయించినా
ప్రయోజనం శూన్యం
గత వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆహార భద్రత కోసం రూ. 110 కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు ఆహార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా విశాఖలో ఈ కేంద్రాన్ని నిర్మించింది. భవన నిర్మాణంతో పాటు సుమారు రూ. 10 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయినా.. ల్యాబ్ సేవలు అందుబాటులోకి రాలేదు.
అందని ఆహార ప్రయోగశాల సేవలు

ఆహార ప్రయోగం..ఇంకెప్పుడు?