
జల ప్రవాహంలో బిక్కుబిక్కుమని..
దేవరాపల్లి: సుందర సరియా జలపాతం కొన్ని గంటలపాటు వారి వెన్నులో వణుకు పుట్టించింది. ఈ పర్యాటక ప్రాంతాన్ని చూద్దామని విశాఖ, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది సందర్శకులు ప్రాణాలు అర చేత పెట్టుకొని బిక్కు బిక్కుమని గడిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండల పరిధిలోని సరియా జలపాతం సందర్శనకు మంగళవారం ఉదయం వీరు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం రావడంతో జలపాతానికి ముందు ఉన్న గెడ్డ ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించడంతో పర్యాటకులంతా అవతలి వైపు చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. దేవరాపల్లి, చీడికాడ ఎస్లు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులతో కలిసి సుమారు 3 గంటలపాటు శ్రమించారు. గెడ్డ ఉధృతి తగ్గిన తర్వాత రోప్ సహాయంతో ఒక్కొక్కరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రాత్రి 10 గంటల సమయంలో దేవరాపల్లి ప్రాంతానికి తీసుకువచ్చారు. స్థానికంగా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి పర్యాటకులకు భోజనం సదుపాయం కల్పించారు.
సరియా వద్ద చిక్కుకున్న 32 మంది పర్యాటకులు
రోప్ సహాయంతో రక్షించిన పోలీసు, ఫైర్ సిబ్బంది