
● భారీగా పింఛన్ల ఏరివేతకేనా? ● ప్రత్యేకంగా సదరం క్యాంపు
మొత్తం దివ్యాంగులు 21,306
ఆర్థోపెడిక్ 12,238
అంధులు 2,373
ఈఎన్టీ 2,287
మానసిక 4,408
రీ వెరిఫికేషన్
జరిగినవి 16,187
రీ వెరిఫికేషన్
చేయాల్సినవి 5,119
పింఛన్ల నిలుపుదల
అంచనా 5-12 శాతం
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సదరం సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ ప్రక్రియతో దివ్యాంగుల్లో అలజడి నెలకొంది. ప్రభుత్వం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందన్న భయాందోళన మొదలయింది. రీ వెరిఫికేషన్లో సర్టిఫికెట్ రద్దు చేస్తే, వైకల్య శాతం తగ్గిస్తే.. లాంటి ఆలోచనలు వారిని మరింత ఆదోళనకు గురిచేస్తున్నారు. రీ వెరిఫికేషన్కు రాని వారికి తాజాగా పింఛన్ కోత పడింది. ఆరు నెలల నుంచి ఈ ప్రక్రియ సాగుతోంది. అనారోగ్యం, ఇతర కారణాలతో రీ వెరిఫికేషన్కు రాలేని వారి పింఛన్లకు ఆ తర్వాతి నెల్లో కోత విధిస్తున్నారు. మొన్న మంచాన పట్టిన వారిని, నిన్న మానసిక వికలాంగులను వదల్లేదు. ఇప్పుడు అంధుల బతుకుల్ని మరింత అంధకారంలోకి నెట్టేందుకు సిద్ధమయ్యారు.
రెండో విడత ఏరివేత
వివిధ కేటగిరీల్లో రూ.6 వేలు నుంచి రూ.15 వేలు పింఛన్ పొందుతున్న దివ్యాంగుల ఏరివేత కార్యక్రమానికి కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. జిల్లాలో వీరు 21,306 మంది ఉండగా ఇప్పటి వరకు 16,187 మంది రీ వెరిఫికేషన్ పూర్తయింది. ఇంకా 5,119 మందికి రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వీరిలో కొంత మంది వివిధ కారాణాల వల్ల రీ వెరిఫికేషన్ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో పింఛన్ నిలుపుదల చేశారు. ఎంత మందికి నిలుపుదల జరిగిందన్న విషయాన్ని అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచింది.
కూటమి సర్కార్ ప్రగల్భాలు
ఎన్నికలకు ముందు దివ్యాంగుల పింఛన్ పెంపుపై ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇపుడు లబ్ధిదారుల తగ్గింపు కుట్రకు తెరతీసింది. పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు తెలివిగా రీవెరిఫికేషన్ బాట పట్టింది. పరిశీలన చేయించుకోని వారికి తర్వాతి నెల నుంచే పింఛన్ కట్ చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక పింఛన్లు తీసుకునే వారి మీద ర్యాండమ్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. నెలకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, 6 వేలు పింఛను తీసుకున్న మంచానికే పరిమితమైన దివ్యాంగులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరికి పరీక్షల నిమిత్తం సంబంధిత ఆస్పత్రులకు రప్పిస్తున్నారు. ఇతర ప్రాంతాల వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏ సాకు పేరిట తమ జీవనాధారమైన పింఛన్కు కోత పెడతారోనని దివ్యాంగుల్లో ఆందోళన నెలకొంది.