
మాట్లాడుతున్న సీపీ రవిశంకర్
దొండపర్తి: ‘కొడుకు, కోడలు ఇద్దరూ.. ఇల్లు, స్థలం డాక్యుమెంట్లతో పాటు రూ.3 లక్షలు నగదు తీసుకొని తిండి పెట్టడం లేదు. కుమార్తెలు దగ్గరకు పంపించేసి వాళ్లని కూడా బెదిరిస్తున్నారు’ అని వెంకటాపురం ప్రాంతానికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడు..
‘కొడుకు తన ఇంట్లోకి చొరబడి కత్తితో గాయపరిచి తన వద్ద ఉన్న ఇంటి పత్రాలు, ఫోన్, వాహనం, పెళ్లికాని కుమార్తె కోసం ఉంచిన రూ.40 వేలు నగదు తీసుకొని వెళ్లిపోయాడు’ అంటూ ఆరిలోవకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు.. ఇలా నలుగురు వృద్ధులు తమ పిల్లలు పెడుతున్న చిత్రహింసలపై నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన స్పందనలో 56 ఫిర్యాదులు రాగా.. ఇందులో నలుగురు వృద్ధులు తమను కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ సీపీకి విన్నవించారు. ఈ ఫిర్యాదులపై సీపీ స్పందిస్తూ వృద్ధులను ఇబ్బందులు పెడుతున్న కుటుంబ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఏడీసీపీ(ఎస్బీ) ఇ.నాగేంద్రుడు, లీగల్ అడ్వైజర్ పి.వి రామకృష్ణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు.