చెరువులో పడి వ్యక్తి మృతి
పరిగి: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి చెరువు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన పరిగి మున్సిపల్ పరిధిలోని సుల్తాన్పూర్లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుడగజంగం హన్మంతు(42) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి రాలేడు. ఉదయం గ్రామ సమీపంలోని చెరువు గట్టుపై చెప్పులు, దుస్తులు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలించగా మృతదేహం లభించింది. మృతుడికి భార్య మేరమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
యాలాల: మండల కేంద్రంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గ్రామకంఠం పరిధిలో ఏర్పాటు చేసిన మంచినీటి బావితో పాటు రాకపోకలకు వినియోగించే దారి కబ్జాకు గురైందని యాలాల సర్పంచ్ శివయ్య, కాంగ్రెస్ నేత పేరి రాజేందర్రెడ్డి బుధవారం ఆరోపించారు. 1970 ప్రాంతంలో మంచినీటి బావిని తవ్వించారని, ప్రస్తుతం అది ఆక్రమణకు గురవుతోందన్నారు. బావిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బావితో పాటు ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు గ్రామకంఠం పరిధిలో ఉన్న రహదారి సైతం పూర్తిగా ఆక్రమణకు గురై, నిత్యం ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి కబ్జా నుంచి బావి తోపాటు దారిని రక్షించాలని వారు కోరారు.
తీవ్రంగా గాయపడిన విద్యార్థి
షాబాద్: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్షం కారణంగా ఓ విద్యార్థి కాలు విరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన విద్యార్థి జశ్వంత్ షాబాద్ తెలంగాణ మోడల్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చేందుకు షాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో వేచియున్నాడు. షాద్నగర్ నుంచి రేగడి చిల్కమర్రికి వెళ్లే బస్సు బస్టాండ్లోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా బాలుడు బస్సు ఎక్కుతుండగానే ఒక్కసారిగా కదలడంతో కిందపడిపోయాడు. దీంతో అతడి కాలు మీదుగా బస్సు టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఓప్రైవేట్ వాహనంలో క్షతగాత్రుడిని పాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
శంకర్పల్లి: పాఠశాలకి వెళ్లిన బాలుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన శంకర్పల్లిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సురేశ్ తెలిపిన ప్రకారం.. రావులపల్లి కలాన్ గ్రామానికి చెందిన మల్లికార్జున్(16) శంకర్పల్లిలోని అన్నపూర్ణ మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు స్కూల్ బస్సు ఎక్కాడు. పాఠశాల దగ్గర బస్సు దిగిన విద్యార్థి బయటకు వెళ్లిపోయాడు. సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనదారుడు మృతి
అబ్దుల్లాపూర్మెట్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెలువర్తి గ్రామానికి చెందిన మారబోయిన వినయ్(25) మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో అబ్దుల్లాపూర్మెట్ నుంచి బాటాసింగారం వైపు ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యలో ఇనాంగూడ బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
రాంగోపాల్పేట్: సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. రాంగోపాల్పేట్ పోలీసులు తెలిపిన మేరకు.. కేరళకు చెందిన అధిరా అనీష్ (24) కిమ్స్లో నర్సుగా పనిచేస్తూ పీజీరోడ్లోని హాస్టల్లో ఉంటుంది. అధిరా అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు కేరళ నుంచి పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి వద్దను ఆమెను కలువగా చిన్న విషయానికి వాగ్వివాదం జరిగింది. తాను హాస్టల్కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిపోయింది. అన్ని చోట్ల వెతికినా ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో పాటు మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తల్లి రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


