పరిగి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరిగి పోలీసులు పట్టుకున్నారు. అయితే గోప్యత పాటిస్తున్నారు. బుధవారం ఉదయం మండలంలోని రాఘవాపూర్ వద్ద ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారని సమాచారం రావడంతో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఎన్ని క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. నిందితులు ఎవరు అనే విషయాలు వెల్లడించడం లేదు.
దోమ: ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఆవు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కుమ్మరికుంట తండాలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత రైతు కేతావత్ తుల్చా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. తన వద్ద ఉన్న పశువుల్లో ఓ ఆవు కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికాడు. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ సమీపంలో కరెంట్ షాక్కు గురై చనిపోయింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
సిటీ కోర్టులు : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్కు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు, వ్యక్తిగత బాండ్లను పోలీస్స్టేషన్లో అందజేయాలని శనివారం ఆదేశాలు జారీ చేయగా, బుధవారం సుమంత్ తరఫున న్యాయవాదులు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో వ్యక్తిగత బాండ్తోపాటు పూచీకత్తులను అందజేశారు. వ్యాపారవేత్తపై దాడి చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేయడంతోపాటు దాడికి పాల్పడ్డారని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ’జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అనంతరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అప్పటినుంచి పరారీలో ఉన్న సుమంత్ మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయన నాంపల్లి కోర్టులో బెయిల్ దాఖలు చేయగా పలు షరతులతో నాంపల్లి సెషన్స్ కోర్టు జడ్జి సాయిరమాదేవి మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు.


