● యువకుడి దుర్మరణం
● బీటెక్ విద్యార్థి అరెస్ట్
ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటు చేసుకోగా.. బుధవారం ప్రమాదానికి కారణమైన యువకుడిని అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. రోహిత్సింగ్యాదవ్(22) మూడు రోజుల క్రితం కోహెడ రోడ్డులోని ఓ ఫంక్షన్ హల్లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీని ముగించుకుని శ్రీ గురు కాలేజీ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సీసీ టీవీ పుటేజీలు, సాంకేతిక ఆధారాలను పరిశీలించగా ఎర్టిగా వాహనం అతివేగంగా నిర్లక్ష్యంగా నడిపిస్తూ ఆయన్ను ఢీకొట్టినట్టు గుర్తించారు. సేకరించిన ఆధారాలతో ఈ ప్రమాదానికి కారకుడైన ఫిర్జాదిగూడకు చెందిన బీటెక్ విద్యార్థి వరుణ్ను బుధవారం అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


