● ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్
● కొడంగల్, బొంరాస్పేట్,దౌల్తాబాద్లో పలు నిర్మాణాల పరిశీలన
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 4, 5 తేదీల్లో కొడంగల్లో పర్యటించనున్న నేపథ్యంలో సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మంగళవారం పట్టణంలోని ఆస్పత్రి భవనం, ఆర్అండ్బీ అతిథి గృహం, పాఠశాల భవనాలను పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం హెలిపాడ్ను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ దీపక్ తివారి, కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.
దేశానికే తలమానికం..
బొంరాస్పేట: హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్ హబ్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూపుదిద్దుకుంటోందని సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్బాబు అన్నారు. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉమెన్ డిగ్రీ కాలేజీ, నర్సింగ్ హాస్టల్ను వచ్చే మార్చి వరకు పూర్తి చేయాలన్నారు. ఫిజియోథెరపీ, పారామెడికల్, నర్సింగ్ కళాశాలల్లో అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. ఇంజనీరింగ్, వెటర్నరీ కాలేజీ పనులను పరిశీలించారు. 35 ఎకరాల్లో నిర్మించే సైనిక్ స్కూల్పై ఆరా తీశారు. ఎత్తిపోతల కాల్వలకు రైతులు అంగీకరించారని, రేడియల్ రోడ్డు పనులు కూడా ప్రారంభమయ్యాయని వివరించారు. ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, అదనపు ఎస్పీ రాజేష్మీన, ఎస్ఈ విజయభాస్కర్ రెడ్డి, కేఎల్ఎస్ఆర్ సీజీఎం కృష్ణప్రసాద్, జీఎం హర్షవర్ధన్రెడ్డి, ఈడబ్ల్యూఐడీసీ శ్రీనివాస్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చంద్రశేఖర్రెడ్డి, తహసీల్దార్ కిషన్నాయక్, ఎంఈఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని ఏర్పాట్లు చేయండి..
దౌల్తాబాద్: మండలంలో సుమారు రూ.25 కోట్లతో నిర్మిస్తున్న మహాత్మజ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాల పనులను వేగవంతం చేసి, మార్చి నెలాఖరువరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గోకఫసల్వాద్ సమీపంలో కొనసాగుతున్న పూలే పాఠశాల, దౌల్తాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వీటిని సందర్శిస్తారని తెలిపారు. అనంతరం దౌల్తాబాద్లో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు కానున్న దౌల్తాబాద్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట ఈడబ్ల్యూడీసీ చీఫ్ ఇంజనీర్ షఫీమియా, డీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉసేనప్ప, నాయకులు రెడ్డిశ్రీనివాస్, భీంరెడ్డి తదితరులు ఉన్నారు.
భూసేకరణలో జాప్యం తగదు..
కొడంగల్ రూరల్: కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఇండస్ట్రియల్ పార్క్, రేడియల్ రింగ్ రోడ్ల భూ సేకరణ పనులను అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆదేశించారు. భూసేకరణలో జాప్యం జరుగుతోందని తహసీల్దార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొడంగల్లో ఆస్పత్రిని పరిశీలిస్తున్న సీఎం ప్రధాన కార్యదర్శి శ్రీధర్
హకీంపేటలో పనులను పరిశీలిస్తున్న అధికారులు


