కలెక్టర్ దీపక్ తివారి కొడంగల్, హకీంపేటలో అభివృద్ధి పనుల పరిశీలన నిర్ణీత గడువులోగాపూర్తి చేయాలని ఆదేశం
కొడంగల్/బొంరాస్పేట: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కొడంగల్లో నిర్మాణంలో ఉన్న పలు భవనాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ బాలుర రెసిడెన్సియల్ స్కూల్ బిల్డిండ్ను, డిగ్రీ కళశాల భవన నిర్మాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పారదర్శకంగా పనులు చేయించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శంగా నిలుద్దాం
అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఆదర్శంగా నిలుద్దామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం దుద్యాల మండలం హకీంపేటలో చేపట్టిన కారిడార్, ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు. డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్, సర్సింగ్ కళాశాలలు, ఫిజియోథెరపీ, వెటర్నరీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే అదనపు కూలీలను నియమించుకోవాలని సూచించారు. ప్రతివారం లక్ష్యం మేరకు పనులు జరగాలన్నారు. నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఈడబ్ల్యూ ఐడీసీ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


