నాలుగు రోజుల్లోనే 2,705 అప్లికేషన్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాల నమోదు కొడంగల్లో ప్రత్యేక సదరం క్యాంపు ఏర్పాటు
వెల్లువ
బషీరాబాద్: కొత్త పింఛన్ కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. ‘చేయూత’ కోసం నాలుగు రోజుల్లోనే జిల్లా వ్యాప్తంగా 2,705 దరఖాస్తులు అందాయి. ఈ నెల 15న అర్జీల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. 31వ తేదీ వరకు అవకాశం ఉంది. దీంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గ్రామాలు, పట్టణాల్లో అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. వచ్చిన వాటిని రోజువారీగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. అర్హతలను పరిశీలించిన తర్వాత తదుపరి ప్రక్రియ చేపడుతున్నారు.
తాండూరులో అత్యధికం
జిల్లాలో మంగళవారం నాటికి 2,705 మంది చేయూత కింద దరఖాస్తు చేసుకుంటే అందులో 2,289 మంది వితంతువులే ఉండడం విశేషం. దివ్యాంగులు 566, గీత కార్మికులు 37, ఒంటరి మహిళలు 24 మంది దరఖాస్తు చేశారు. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే తాండూరులో అత్యధికంగా 1,014, వికారాబాద్లో 806, పరిగిలో 495, కొడంగల్లో 390మంది అర్జీలు సమర్పించారు. మొత్తంగా 2,705 దరఖాస్తులు అందాయి.
దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి
దివ్యాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి వైకల్య శాతం నిర్ధారణ కీలకం. ఇందుకోసం ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహిస్తున్నారు. తొలుత సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో సదరం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అవసరాన్ని బట్టి ఇతర నియోజకవర్గాల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. దివ్యాంగులు సదరం క్యాంపు ద్వారా సర్టిఫికెట్లు పొందాలని డీఆర్డీఓ అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే 1,07,113 మందికి..
జిల్లాలో ఇప్పటికే 1,07,113 మంది వివిధ కేటగిరీల కింద సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 48,508 మంది వితంతువులు, 39,665 మంది విద్యా పింఛనుదారులు, 12,326 మంది దివ్యాంగులు, 4,564 మంది ఒంటరి మహి ళలు, 1,130 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. ఇతర కేటగిరీల వారూ పింఛన్లు పొందుతున్నారు. గడువు ముగిసేలోపు అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 31వరకు అవకాశం ఉన్నందున దరఖాస్తులు భారీగా పెరిగే అవకాశం ఉంది.


