తాండూరు రూరల్: ఎరువుల కోసం వచ్చే రైతులను ఫెర్టిలైజర్ దుకాణ యజమానులు ఇబ్బంది పెట్టరాదని తాండూరు ఏడీఏ అరుణ ఆదేశించారు. మంగళవారం పెద్దేముల్ మండల కేంద్రంలో టాస్క్ఫోర్స్ అధికారులు, తహసీల్దార్ వెంకట్ప్రసాద్, ఎంపీడీఓ తిరుమల స్వామితో కలిసి తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు రైతు వేదికలో సబ్సిడీపై కంది, పెసర, మినుము విత్తన బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎల్నినో కారణంగా తక్కువ నీటి అవసరం కలిగిన కంది, పెసర, మినుము పంటలను సాగు చేయాలని సూచించారు. 50 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎరువుల దుకాణంలో స్టాక్ వివరాలు, ధరల పట్టిక కచ్చితంగా ఉండాలన్నారు. ఎరువులు, విత్తనాలు కొనే రైతులు విధిగా రసీదు పొందాలని సూచించారు. యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందరాదన్నారు. పెద్దేముల్, తట్టెపల్లి సొసైటీలకు వారానికి మూడు వేల యూరియా బస్తాలు వస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ ప్రీతం, సర్పంచు డీవై చిన్న నర్సింలు, ఏఈఓలు చంద్రకళ, దేవేందర్, శ్రవణ్ తదితరులుక పాల్గొన్నారు.
తాండూరులో..
పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో మంగళవారం టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ, ఎంపీడీఓ, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నకిలీ ఎరువులు, మందులు విక్రయిస్తే దుకాణ లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.


