డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్
కుల్కచర్ల: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ అన్నారు. సోమవారం కుల్కచర్ల పీహెచ్సీలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిశువు పుట్టిన వెంటనే ముర్రుపాలు పడితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు పట్టాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డా.కిరణ్కుమార్ గౌడ్, సిబ్బంది యాదమ్మ, రాజు, సిరాజ్, జంగమ్మ, మంగమ్మ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతగిరి: మేరా యువ భారత్ ఆధ్వర్యంలో పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలలో నషా ముక్త్ యువ వికసిత్ భారత్ పేరిట జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. జానపద సంగీతం, నృత్యం, లఘుచిత్రం, మైమ్, స్లామ్పోయెట్రీ, వకృత్వం, చిత్రలేఖనం, నినాద రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి నర్సింలు మాట్లాడుతూ.. ప్రథమ స్థానంలో నిలిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మై భారత్ డిప్యూటీ డైరక్టర్ స్నేహల్ బసుత్కర్, మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ ఖలీల్, మై భారత్ వంటీర్లు దాసరి శ్రీశైలం, ర వి, ఖాజా కరీమొద్దీన్, కార్తీక్, అర్చన, సింహాద్రి, వైద్య విద్యార్థులు తదితరులుపాల్గొన్నారు.
యాలాల: మండలంలోని రాస్నం వరి కొనుగోలు కేంద్రంలో రైతుల ధాన్యం డబ్బులు ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లాయనే ఆరోపణలపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కొనుగోలు కేంద్రంలో జరిగిన అవకతవకలపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ధాన్యం సొమ్ము దారి మళ్లిందా? అనే శీర్షికన ప్రచురితమైన కథనం మండలంలో చర్చకు దారి తీసింది. ఇదే అంశంపై ప్రజా సంఘాల నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాగా కొనుగోలు కేంద్రం బాధ్యతలు తీసుకున్న ఐకేపీ సిబ్బంది, బుక్ కీపర్లను విచారించాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. కాగా మంగళవారం గ్రామంలో ఐకేపీ సిబ్బందిని విచారించే అవకాశాలున్నాయి.
కుల్కచర్ల: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతిహెప్సిభా అన్నారు. ఇటీవల తాండూరులో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి అరుణ్కుమార్ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. సోమవారం బాలుడిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పీఈటీ కృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బొంరాస్పేట: మండలంలో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి 9గంటల వరకు వాన దంచికొట్టింది. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరి నాట్లు వేసేందుకు ఇదే సరైన సమయమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


