దౌల్తాబాద్: నష్టపరిహారం అందిన తర్వాతే భూములు అప్పగిస్తామని రైతులు స్పష్టం చేశారు. నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం తహసీల్దార్ వెంకట్స్వామి మాట్లాడగా.. వారు పై విధంగా స్పందించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. తగిన పరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. కొడంగల్ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎత్తిపోతల పథకం అమలు చేయనుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డీటీ వెంకటాచారి ఉన్నారు.
దుద్యాల్: నారాయణపేట్– కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్, దుద్యాల్, దౌల్తాబాద్, బొంరాస్పేట్ మండలాలతో పాటు నారాయణపేట్ జిల్లా పరిధి కోస్గి, మద్దూర్, గుండుమల్, కొత్తపల్లి మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏటీ కాల్వల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా దుద్యాల్ మండలం హస్నాబాద్, కుదురుమల్ల గ్రామంలో భూ సర్వే పూర్తయింది. శుక్రవారం రెండు బృందాలుగా ఏర్పడి, కుదురుమల్లలో 21 ఎకరాలు, హస్నాబాద్లో 28 ఎకరాల సర్వే ప్రక్రియను ముగించామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ఇందులో సర్వేయర్ దేవెందర్, జీపీఓ గోపాల్, రెవెన్యూ సిబ్బంది ఊషప్ప, రైతులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్
తాండూరు: కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. శుక్రవారం కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తాండూరులో ఎన్ఎస్పీ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ చేశారు. జిల్లా ఆస్పత్రి, మాతా శిశు కేంద్రంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్పీ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీవాణి, సభ్యులు అబిద్, భానుప్రసాద్, జావీద్, రాము, సాయి, మహేశ్, మొయిజ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్: మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి పరిశీలించారు. చిట్లపల్లిలో పర్యటించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. అంగడిరాయిచూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కొడంగల్ వేంకటేశ్వర స్వామి ఆలయ నవీకరణ పనులను పరిశీలించి వేగవంతంగా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసూఫ్, ముస్తాక్, నాగప్ప తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ రాగి తీగల చోరీ
మహేశ్వరం: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన కందుకూరు మండల పరిధిలోని కొత్తగూడ గ్రామంలో చోటు చేసుకుంది. కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, పాండు రంగారెడ్డి వ్యవసాయ పొలంలో ఉన్న రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని సుమారు 60 కిలోల రాగి తీగలను దుండగులు గురువారం అర్ధరాత్రి దొంగిలించారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులకు ట్రాన్స్ఫార్మర్లలోని రాగి తీగలను ఎత్తుకెళ్లిన ఆనవాళ్లను గమనించి పోలీసులు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సీఐ వెంకటేశ్వర్లు, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


