● కాక్రోచ్ జనతా పార్టీకి
నక్సలైట్ల అండ
● దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్ ప్రయత్నం
● రేవంత్రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటే
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
షాద్నగర్: దేశంలో అశాంతిని సృష్టించి, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, విదేశీ శక్తులు కుట్రలు పన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. షాద్నగర్ శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై మాట్లాడారు. కొంతమంది సినిమా వాళ్లు, ఆటగాళ్లు, నక్సలైట్లు కలిసి దేశంలో అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా కాక్రోచ్ జనతా పార్టీతో ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. గతంలో హైదరాబాద్లో ఈపార్టీ నిర్వహించిన సమావేశానికి నక్సలైట్లు హాజరయ్యారని తెలిపారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలో కాంగ్రెస్ నాయకులు సైతం ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలోనూ అనేక ప్రశ్నపత్రాలు లీకయ్యాయని, అప్పుడు కేంద్ర మంత్రులు ఎవరైనా రాజీనామా చేశారా.. అని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాహుల్గాంధీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని, విద్యార్థులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు
సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ ఒక్కటేనని, వీదిద్దరూ కలిసి రాష్ట్రంలో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని రాంచందర్రావు దుయ్యబట్టారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటై ఎంఐఎంకు మద్దతు తెలిపాయన్నారు. దేశంలో ఏం జరిగినా రేవంత్రెడ్డి, కేటీఆర్లు ఒక్కటై ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ఆందోళనలు చేస్తుంటారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో గ్రూప్– 1, ఇంటర్ పేపర్లు లీకయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, యూనివర్సిటీల అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి ఇస్తానన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయని నిలదీశారు. ఇకపై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్భూపాల్గౌడ్, నాయకులు బూర నర్సయ్య గౌడ్, బొక్కా నర్సింహారెడ్డి, రఘునాథ్రావు, అంజన్కుమార్ యాదవ్, శ్రీవర్ధన్రెడ్డి, అందెబాబయ్య, కక్కునూరి వెంకటేశ్గుప్తా, డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


