తాండూరు రూరల్: అధిక లోడు, ఆపై అజాగ్రత్తగా టిప్పర్లు దూసుకుపోతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా.. లోడుపై టార్పాలిన్ కవర్లు కప్పకుండా తరలిస్తున్నారని తెలిపారు. దీంతో వెనకాల వచ్చే వాహనదారులు దుమ్ముధూళితో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా వేసిన సీసీరోడ్లు సైతం ధ్వంసం అయ్యాయన్నారు. జిల్లాలోని మేజర్ పంచాయతీ కరన్కోట్ గ్రామ శివారులో ఆదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన క్రషర్ ఉంది. ఇక్కడి నుంచి లైమ్స్టోన్ను నిత్యం టిప్పర్ల ద్వారా బెల్కటూర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారానికి తరలిస్తుంటారు. టిప్పర్లు రెండు రకాలుగా ఉంటాయని, అందులో ఒకటి 26 టన్నుల సామర్థ్యం కలిగిన దాంట్లో 41 టన్నుల వరకు, మరో టిప్పర్లో 21 టన్నులకు బదులు 35 టన్నుల లైమ్స్టోన్ను తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇలా ఓవర్ లోడ్ తీసుకెళ్లడమే కాకుండా.. లోడుపై కనీసం టార్పాలిన్లు కూడా కప్పడం లేదంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, ఓవర్లోడ్ను అరికట్టాలని కరన్కోట్ గ్రామస్తులు కోరుతున్నారు.
కనీస ప్రమాణాలు పాటించని టిప్పర్లు
పట్టించుకోని అధికార యంత్రాంగం
రోడ్లు ధ్వంసం.. వాహనదారుల ఇబ్బంది


