దోమ: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ సూచించారు. శుక్రవారం మండలంలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ప్రభాకర్ రావుతో కలిసి తనిఖీ చేశారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లులు, ధరల పట్టికలు, లైసెన్సులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
బషీరాబాద్ మండలంలో..
బషీరాబాద్: మండలంలోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు శ్రీనివాస్, రఘురామ్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల వ్యవసాయాధికారితో కలిసి ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, విక్రయ వివరాలు, ధరల పట్టికలు, లైసెన్సుల చెల్లుబాటు, ప్రభుత్వ నిబంధనల అమలును పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఎరువులను తగిన నిల్వలతో అందుబాటులో ఉంచాలని డీలర్లకు సూచించారు. విక్రయాల సమయంలో తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు చేయరాదని హెచ్చరించారు. నిబంధలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.
విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్


